. 48 గంటల్లో తారుమారైన పరిస్థితి
. ఉమ్మడి జిల్లాలో తగ్గని వాన
. ఎస్సారెస్పీ గేట్ల ఎత్తివేత
. అలీసాగర్ ఒక గేటను ఎత్తిన అధికారులు
. తాగు, సాగునీటికి భరోసా
. ఎస్సారెస్పీని సందర్శించిన కలెక్టర్, సీపీ
బతుకమ్మ, నిజామాబాద్ : గంటల వ్యవధిలో పరిస్థితి తారుమారైంది. ముసురుగా ప్రారంభమైన వాన ముంచెత్తింది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు ఒకస్థాయి ఇన్ ఫ్లోతో క్రమంగా ప్రాజెక్టుల ఇన్ ఫ్లో పెరగగా, సోమవారం ఉదయానికి సీన్ మారి గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలో మూడు రోజులు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల రోడ్లు కొట్టుకుపోయాయి. వాగులు ఉధ్రుతంగా ప్రవహిస్తుండగా, చెరువులు అలుగుపారుతున్నాయి. వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాల జాబితాలో నిజామాబాద్ కూడా ఉంది. పదిపదిహేను రోజుల క్రితం వరకు నీటి జాడ లేక వెలవెలబోయిన వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఏది ఏమైనా వరుణుడు గంటల వ్యవధిలో అంతాతారుమారు చేశాడని ఉమ్మడి జిల్లా ప్రజలు పేర్కొంటున్నారు.
ఎస్సారెస్పీ వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో లక్షల్లోకి..
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీ రాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. గత నెల 31న 9వేల ఇన్ ఫ్లో రాగా, ఆ సమయంలో ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీరు 60.47 టీఎంసీలు మాత్రమే. అదే రోజు రాత్రి 9 గంటల ప్రాంతంలో 15,689 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా, శనివారం రాత్రి నుంచి వర్షం ప్రారంభం కావడంతో ఆదివారం ఉదయానికి 21,500 క్యూసెక్కులకు పెరిగింది. క్రమంగా పెరుగుతూ రాత్రి వరకు ఇన్ ఫ్లో లక్ష క్యూసెక్కులకు పెరిగింది. సోమవారం ఉదయం 1,62,182 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా, ఉదయం 8 గేట్లను ఎత్తి 34,853 క్యూసెక్కులను, 11 గంటల ప్రాంతంలో 26 గేట్లను ఎత్తి లక్ష క్యూసెక్కులను గోదావరిలోకి వదిలారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లక్షా 95,7678 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రావడంతో లక్ష క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మధ్యాహ్నం 12,30 గంటల ప్రాంతంలో 40 గేట్లను ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలారు. ఈ వర్షాకాలంలో తొలిసారి ప్రాజెక్టు గేట్లను సోమవారం ఎత్తారు. సందర్శకులతో ప్రాజెక్టు కిటకిటలాడింది. ఎస్సారెస్పీని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సందర్శించారు. అంతకు ముందు సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి నీటి పారుదలశాఖ అధికారులతో కలిసి పరిస్థితి సమీక్షించారు.
నిజాంసాగర్ కు పెరుగుతున్న ఇన్ ఫ్లో
భారీ వర్షాల కారణంగా నిజాంసాగర్ జలకళను సంతరించుకుంది. గత నెల 31న నిజాంసాగర్ ప్రాజెక్టుకు 1451 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగా, ఆ రోజున ప్రాజెక్టులో 4.825 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆదివారం ఉదయం కూడా అదే పరిస్థితి కొనసాగింది. సాయంత్రానికి ఇన్ ఫ్లో 24వేల క్యూసెక్కులకు పెరిగి సోమవారం ఉదయం వరకు 25వేల క్యూసెక్కులకు పెరిగింది. మధ్యాహ్నం సమయానికి ఏకంగా 57వేల క్యూసెక్కులకు పెరగడంతో ప్రాజెక్టు నీటి మట్టం 1396.72కి చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, రెండు మూడు రోజుల్లోనే ప్రాజెక్టు గేట్లను ఎత్తే అవకాశం ఉంది.
కల్యాణి నుంచి 6వేల క్యూసెక్కుల అవుట్ ఫ్లో
నిజాంసాగర్ ప్రాజెక్టు డైవర్షన్ స్కీం అయిన కళ్యాణి ప్రాజెక్టులోకి ఆదివారం నుంచి 6వేలకు పైగా క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, అదే స్థాయిలో నిజాంసాగర్ ప్రధాన కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నీటి నిలువ సామర్థ్యం 409.50 మీటర్లు కాగా, ప్రస్తుతం 408.50 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది.
పోచారం ప్రాజెక్టుకు 21వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా దానికి సమానంగా నీటిని విడుదల చేస్తున్నారు. కౌలాస్ నాలా ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో అంతంతమాత్రంగానే కొనసాగుతోంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 1.237 టీఎంసీ కాగా, ప్రస్తుతం 0.720 టీఎంసీ మేర నీరు నిల్వ ఉంది. 500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. మరో 3మీటర్ల మేర నీరు చేరితే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరే అవకాశం ఉంది. సింగీతం రిజర్వాయర్ పూర్తిగా నిండి మత్తడి దుంకుతున్నది.