- కబ్జాలతో అన్యక్రాంతం
- 4 చెరువులు, కుంటల లెక్కలు గాయబ్
- హైడ్రా నేపథ్యంలో ఎల్లారెడ్డి పుర ప్రజల్లో చిగురిస్తున్న ఆశలు
బతుకమ్మ, ఎల్లారెడ్డి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో చెరువులు,కుంటలు అన్యక్రాంతమయ్యాయి. చెరువులు, కుంటల శిఖం భూములతో పాటు ఏకంగా చెరువులే మాయం అయ్యాయి. గత ప్రభుత్వ హయంలో ఎల్లారెడ్డి మేజర్ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారినప్పటి నుంచి కబ్జాలు ఆగడం లేదు. ఇటీవల ప్రభుత్వం హైడ్రా పేరిట చెరువులు, శిఖం భూముల కబ్జాలను తొలగిస్తుండడంతో ఎల్లారెడ్డి పట్టణ ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. రికార్డుల ప్రకారం ఎల్లారెడ్డి బల్ధియా పరిధిలోనే 14 చెరువులు,కుంటలు ఉన్నాయి. సర్వేనంబర్లు, రికార్డులు అన్నీ పక్కాగా ఉన్నప్పటికి అవి చాలా మట్టుకు అన్యక్రాంతమయ్యాయి.
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని బతుకమ్మ కుంటను డంపింగ్ యార్డుగా చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా బతుకమ్మ కుంటను పునరుద్దరణకు 17.65 లక్షలు వెచ్చించినట్లు శంకుస్థాపనలు, శిలాఫలకాలు ఉన్నాయి. కానీ నేడు అది డంపింగ్ యార్డుగా మారిపోయింది. చెలిమే కుంట కబ్జాకు గురయింది. కుమ్మరి కుంట ఖతం చేసిండ్రు. పోచమ్మ కుంట పోతం పట్టిండ్రు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎల్లారెడ్డి పట్టణంలో గత ప్రభుత్వ హయంలో నీటి పారుదల శాఖ వద్ద ఉన్న రికార్డుల ప్రకారం 14 చెరువులు, కుంటలకు సంబంధించి సుమారు వంద ఎకరాల భూములు కబ్జా అయ్యాయి. ముఖ్యంగా మున్సిపాలిగా మారిన తర్వాత అంతకుముందే దానిపై ఖద్దర్ ల కన్ను పడడంతో కబ్జాలు ప్రారంభమయ్యాయి. చెరువులు,కుంటలే కాకుండా ఏకంగా ఆలయ భూములు, వక్ప్ బోర్డు భూములను కూడా చెరపట్టిన ఘనత లీడర్లకు ఉంది.
ఎల్లారెడ్డి పట్టణంలోని గండి చెరువు 17.27 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. కుమ్మరి కుంట 2.4 ఎకరాల్లో ఉంది. పోచమ్మ కుంట 1.22 గుంటల్లో ఉంది. కొత్త చెరువు 16.15 ఎకరాల్లో ఉంది. కుంచ కుంట శిఖం 3.20 ఎకరాలలో,పెద్ద చెరువు 29.24 ఎకరాలలో,ఎల్లమ్మకుంట 3.12 ఎకరాల్లో, దేవుని కుంట 7 ఎకరాల్లో, మోర్సుకుంట 5.34 ఎకరాల్లో, పోకలకుంట 3.10 ఎకరాల్లో, వీరన్నకుంట 5.25, రాజులకుంట 8.13, చెలిమేకుంట 5.20, బుడిసి కుంట 3.03 ఎకరాల్లో ఉన్నట్లు నీటి పారుదల శాఖ రికార్డులు చెబుతున్నాయి. అవన్ని రికార్డులకే పరిమితం కాగా ఇప్పుడన్నీ కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి.