- గొడవలు లేకుండా దందా చేసుకోవాలని నిర్ణయం
- నలుగురు సూత్రదారులుగా నెట్ వర్క్
- బోధన్ లోని అచన్ పల్లి రైసుమిల్లుకు రేషన్ బియ్యం
- ఖాకీలకు వేతనాలకన్నా ముందుగానే మామూళ్ళు
బతుకమ్మ, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంగా గత కొంత కాలంగా కొనసాగుతున్న పీడీఎస్ మాఫియా ఒకే గొడుగు కిందకు వచ్చింది. నలుగురు సూత్రదారులు సిండికేట్ గా ఏర్పడి రేషన్ బియ్యాన్ని సేకరించి మిల్లర్లకు అమ్ముకోవాలని నిర్ణయించారు. గతంలోనూ పీడీఎస్ మాఫియా సిండికేట్ గా ఉన్నప్పటికీ రెండు హత్య కేసులు అంతకు మించి హత్యాయత్నం కేసులు నమోదు కావడంతో సిండికేట్ మాఫియాకు బ్రేకులు పడ్డాయి. రెండేళ్ళ కాలంలో రెండు హత్యలు, ఒక హత్యాయత్నం కేసులు కావడంతో సిండికేట్ మాఫియా అంతా కూడబలుక్కొని పీడీఎస్ దందాను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించి అమలు చేస్తున్నారు.
నలుగురు సూత్రదారులు ప్రధానంగా ఇద్దరు సోదరులు మిర్చికంపౌండ్ లో, నటరాజ్ థియేటర్ ఎదురుగా గల్లీలో రెండు ఇళ్ళలో, గోదాములో బియ్యాన్ని నిల్వ చేసి రవాణా చేస్తున్నారు. మహ్మదీయ కాలనీకి చెందిన మరో వ్యక్తి తన పాత ఫ్యాక్టరిని గోదాముగా చేసి బియ్యాన్ని నిల్వ చేయడం,రవాణా చేయడం చేస్తున్నారు. ఇందులో సిరికొండకు చెందిన మరో వ్యక్తి తోడయ్యారు. నలుగురు కలిసి ఈ దందాను తిరిగి ప్రారంభించారు. ఆరవ టౌన్ పరిధిలోని ఒకప్పటి మాజీ ఎంపీటీసీ తనకు రావాల్సిన దందాలోని డబ్బుల విషయంలో సిరికొండకు చెందిన సూత్రదారితో సయోధ్య జరిపి ఈ దందాతో పునర్జీవం చేయడంలో సఫలమయ్యారు. రెండేళ్ళ కాలంలో జంగల్ ఇబ్బు, ఆరీఫ్ డాన్ లు హత్యకు గురి కాగా సిరికొండలో కాలపత్తార్ అసద్ గ్యాంగ్ పీడీఎస్ వ్యాపారిపై సూపారి తీసుకుని హత్యాయత్నం చేసిన విషయం తెల్సిందే. ఈ మూడు కేసులు తీవ్రత కారణంగా పీడీఎస్ మాఫియా ఆనాడు చెల్లుచెదురు కాగా ఇప్పుడు మాత్రం కలిసికట్టుగా దందా చేయాలని ఒక్కటయ్యారు. నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి బియ్యంను తీసుకువచ్చి గోదాములో భద్రపరిచి ఎప్పుడుకావాలంలే అప్పుడు డీసీఎంలు, ఐచర్ వాహనాల్లో రవాణా చేస్తున్నారు. సంబంధిత బియ్యం సీఎంఆర్ లోటు కలిగిన మిల్లర్లకు అమ్మడానికి లేకపోతే ప్రతినిత్యం వెళ్లే బోధన్ పట్టణంలోని ఆచన్ పల్లికి తరలించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఇప్పుడు ఈ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది.
పీడీఎస్ మాఫియా ఏకమైనప్పటికీ కేసులు నమోదు కాలేదంటే వారికి ఖాకీల వెన్నుదన్నే కారణమని చెప్పాలి. నిఘా వర్గాలతో పాటు లోకల్ పోలీసులకు వారికి వచ్చే వేతనాల కంటే ముందుగానే టంచన్ గా మామూళ్ళు అందుతుండడంతో పీడీఎస్ దందా మామూలుగా సాగడం లేదు. నిత్యం టన్నుల కొద్ది బియ్యం ప్రధాన రహదారులపైనే రయ్యుమని దూసుకెళ్తున్నా అడ్డుకునే వారే లేరు. పైపెచ్చు పీడీఎస్ మాఫియానే పలానా సమయంలో తమ వాహనాలు రోడ్డుపై వెళ్తాయని రూట్ మ్యాప్ ను స్థానిక పోలీస్ స్టేషన్ లోని ఎస్ హెచ్ వోలు, సిఐలకు ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దాని కారణంగానే నిత్యం టన్నులకొద్ది బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నా సున్నా కేసులు నమోదవుతున్నాయి. ఏదో అడపాదడపా కేసుల కోసం చిన్నచితక ఆటోలలో, ట్రాలీలలో బియ్యం పట్టుబడుతున్నాయి కానీ లారీలకు లారీలు సరిహద్దులు దాటుతున్న పట్టుకునే వారే లేకుండాపోయారు. రెండు హత్యలు, పలు హత్యాయత్నం కేసుల నేపథ్యంలో ఖాకీలతో స్నేహం బలపడి పీడీఎస్ దందా వారే వెన్నుదన్నుగా ఉన్నారని వినికిడి. పోలీసు బాసులు చేసినా, పొలిటికల్ లీడర్లు ఫోన్లు చేసినా పట్టించుకోని పోలీసులు పీడీఎస్ మాఫియా ఒక్క కాల్ చేస్తే అంతా తామై వ్యవహరించి పనులు చేసి పెడుతున్నారని ఏకంగా వారు ఇచ్చే కేసులకు సెటిల్ మెంట్లు కూడా చేయడం గమనార్హం. ఇప్పుడు ఖాకీలు పీడీఎస్ మాఫియా చెట్టాపట్టాలు వేసుకుని స్టేషన్ లలో భజాప్త కూర్చోండి తతంగం నడుపుతున్నారు. ఈ విషయం పోలీసు బాసు గురిస్తే కానీ మాఫియాకు చెక్ పడే అవకాశం లేదు.