స్వామి గౌడే స్థానికేతరుడు
. . . కార్మికులకు నెలకు 4 వేలు, ఆ ముగ్గురికి 2లక్షల వేతనమా
. . . సభ్యులకు అయిదు నెలలు అయిన అందని వేతనం
. . . సొసైటీ నుండే కారు డ్రైవర్లకు వేతనమా?
. . . ఆధార్ లతో సహా నిరూపణ చేసిన గౌడ సంఘం నాయకులు
. . . పోరాడిన వారికి కాకుండా కుటుంబ సభ్యులకు కార్మికులుగా అవకాశం
. . . గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్
బతుకమ్మ, నిజామాబాద్
నిజామాబాద్ నగరంలోని భవానీ గీతా పారిశ్రామిక సహకార సంఘం సొసైటీలో జరుగుతున్న అక్రమాలపై బహిరంగంగా చర్చించడాని సిద్ధమే అని గౌడ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ మూడవ డిపో నాయకులకు సవాల్ విసిరారు. ఆదివారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మూడవ కళ్ళు సొసైటీకి చెందిన గౌడ కులస్తులతో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మూడవ కళ్ళు సొసైటీలో గీతా కార్మికుల పొట్టను కొట్టి సంఘం బైలాను తుంగలోకి తొక్కేసి స్వామి గౌడ్ కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారని, హైదరాబాద్ లో నాలుగు కోట్ల రూపాయల విల్లాను, నిజామాబాద్ లో కోటి రూపాయలతో ఇల్లును, మూడు కార్లను కొనుగోలు చేశారని డిపో యజమానులుగా చలామణి అవుతున్న మరో ఇద్దరు వ్యక్తులు కోట్ల రూపాయలు ఎక్కడి నుండి సంపాదించారని ప్రశ్నించారు. ఈ ముగ్గురు మాత్రం నెలకు తలా రూ.2 లక్షల వేతనం తీసుకుంటు,కార్మికులకు కేవలం రూ. 4 వేలు, సభ్యులకు నెలకు 1000 ఇస్తూన్నారని, ఐదు నెలల నుండి సబ్యులకు ఆ వేయి రూపాయలు కూడా ఇవ్వడం లేదన్నారు. సొసైటీ బైలా ప్రకారం వచ్చిన లాభాలను 15 శాతం వాటాను కార్మికులకు పంచాలని, 25 శాతం లాభాలను గీతా కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగించాలని, సొసైటీ పేరు మీద ఆస్తులు కూడా కట్టాలి, సొసైటీ పేరు మీద ఒక్క గజం భూమి కూడా ఒక్క రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేకుండా చేసి వచ్చిన లాభాలు అంతా కూడా ఈ ముగ్గురే పంచుకోవడం జరిగిందని ఆరోపించారు. నగరంలోని మొదటి, రెండవ సొసైటీలో సభ్యత్వం లేని గౌడ కులస్తులను గీత కార్మికుల కోసం గత ప్రభుత్వం మూడవ కళ్ళు సొసైటీకి అనుమతులు ఇవ్వడం జరిగిందని, అనుమతులు వచ్చిన తర్వాత సొసైటీ కోసం పోరాడిన వ్యక్తులకు కాకుండా స్థానికేతరులైన స్వామిగౌడ్ తన బంధుబలగంతో నింపడం జరిగిందని వారికి సంబంధించిన ఆధారాలతో సహా బయటపెట్టారు. ఈ ఆధారాలు తప్పయితే బహిరంగంగా చర్చించడానికి తాను సిద్ధమేనని, నా ఆరోపణలు తప్పని నిరూపిస్తే ముక్కునేలకు రాస్తానని అన్నారు. వేరే జిల్లా వారికి ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, ఉపాధి హామీ కార్డులు, పెన్షన్ కార్డులు కలిగిన వ్యక్తుల వివరాలను అన్ని కూడా మీడియా సమక్షంలో చూపెట్టినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లువ్యవహరిస్తున్నారని, మామూళ్ల మత్తులో కూరుకపోయి ఉన్నారని వారి పైన కూడా రాష్ట్రస్థాయి అధికారులకు సైతం ఫిర్యాదు చేయడానికి వెనుకాడబోమని తేల్చి చెప్పారు. స్థానికులకు గీతా కార్మికులుగా అవకాశం కల్పించాలని సొసైటీలో స్థిర నివాసం ఉన్నటువంటి గౌడ కులస్తులకు సభ్యత్వం కల్పించాలని అంతవరకూ పోరాటం ఇదేవిధంగా కొనసాగుతుందన్నారు. నెల రోజులుగా అక్రమ ఆధార్ కార్డులపై జిల్లా కలెక్టర్ కి, పోలీస్ కమిషనర్ కి, ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందని ఇంతవరకు విచారణ మాత్రం ముందుకు సాగడం లేదని, ఈ అక్రమ ఆధార్ కార్డుల మార్ఫింగ్ పై కేంద్ర హోంశాఖకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా సైతం ఫిర్యాదు చేయబోతున్నామని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో గౌడ సంఘం నాయకులు రాజగోపాల్ గౌడ్, సిరిగాథ స్వామి గౌడ్, బాబా గౌడ్, అశోక్ రాజ్ గౌడ్, అఖిల్ గౌడ్, రాజ్ కుమార్ గౌడ్, సత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.