బతుకమ్మ, నిజామాబాద్: ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్ననేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్, జగిత్యాల జిల్లాల కలెక్టర్లకు ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ రాశారు. ఇప్పటికే పనిచోట్ల రోడ్లు తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని, మరో రెండుమూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ ఆర్ అండ్ బీ, పోలీస్, విద్యుత్, ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తినందున మత్స్యకారులను అప్రమత్తం చేయాలని, నిరాశ్రయులైను పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి కనీస సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే భారతీయ జనతా పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆయన కోరారు.