బతుకమ్మ, నిజామాబాద్ రూరల్: హైదరాబాద్ లో నిర్వహించనున్న విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు జిల్లా నుంచి ఎమ్మార్పీఎస్ నాయకులు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. 30 ఏళ్లపాటు సుదీర్ఘపోరాటం చేసి ఎస్సీ వర్గీకరణ సాధించి ఢిల్లీ నుంచి వస్తున్న మందకృష్ణ మాదిగకు ఘనస్వాగతం పలుకుతామని ఎమ్మార్పీఎస్, ఎంఈఎఫ్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఉద్యమ పోరాటాన్ని నడిపిన ఘనత మాదిగ జాతికే చెల్లిందని, మూడు దశాబ్దాలపాటు మాదిగ యోధుడు మందకృష్ణ మాదిగ ముందుండి పోరాడారన్నారు. సామాజిక న్యాయంలో భాగంగా వర్గీకరణకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోడీకి, సహకరించిన అన్ని పార్టీల శ్రేణులకు ముఖ్యంగా వర్గీకరణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలకు, ప్రతి ఒక్కరికీ సామాజిక ఉద్యమాభినందనలు తెలుపుతున్నామన్నారు. ప్రస్తుతం అమలవుతున్న ఉద్యోగ నోటిఫికేషన్లు, విద్య, ఉద్యోగ రంగంలో, ఉద్యోగుల ప్రమోషన్లలో ఎస్సీవర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు సరికెల పోశెట్టిమాదిగ , ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కనక ప్రమోద్ మాదిగ, మాదిగ ఉద్యోగుల రాష్ట్ర నాయకులు సిలుమల సురేశ్, తెడ్డు గంగారాం, జిల్లా నాయకులు కూడల ప్రవీణ్, మారుతి, సూరజ్, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగం రాజేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు రొడ్డ ప్రవీణ్, ఎమ్మెస్పీ జిల్లా నాయకులు మంద ప్రభాకర్ మాదిగ, వీహచ్ పీఎస్ జిల్లా అధ్యక్షుడు బీరప్ప, ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యకుడు ఆకారం రమేశ్, నిజామాబాద్ అర్బన్ అధ్యక్షుడు పెద్దిగారి మహేశ్ మాదిగ, జిల్లా కార్యదర్శి ప్రదీప్, రాంచంద్రం, శేఖర్, సాయిలు, మహేశ్, బాలు, సాయి, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.