- బోధన్ నియోజకవర్గంలో బిఆర్ఎస్, బిజెపి ధర్నాలు
బతుకమ్మ, బోధన్ : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతన్నలకు ఇచ్చిన రూ. 2 లక్షల రైతు ఋణమాఫీని ఎలాంటి షరతులు, ఆంక్షలు లేకుండా వెంటనే సంపూర్ణ ఋణమాఫిని చెయ్యాలని డిమాండ్ చేస్తూ నియోజకవర్గంలో బోధన్ పట్టణం తో పాటుగా వివిధ మండలాల్లో బిఆర్ఎస్ శ్రేణులు, బిజెపి కార్యకర్తలు వేరువేరుగా ధర్నాలు నిర్వహించి తహశీల్దార్ కు వినతిపత్రాలు అందజేశారు. గురువారం బోధన్, నవీపేట్, తదితర మండల కేంద్రాల్లో బీయర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో షరతులు లేకుండా రైతులకు 2 లక్షల పూర్తి ఋణమాఫీ చెయ్యాలని, డిమాండ్ చేస్తూ రోడ్ల పై భైఠాయించి ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం ను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రుణమాఫీ లో కొన్ని ఆంక్షల పేరుతో కొందరు రైతులకు రుణమాఫీ చేయలేదని, రైతులందరికీ ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చెయ్యాలని, డిమాండ్ చేశారు. లేనియెడల రైతుల పక్షాన పోరాడతమని హెచ్చరించారు. రైతులని మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామ చెయ్యాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా ఇవ్వకుంటే రైతులు గ్రామాల్లో కాంగ్రెస్ నేతలని నిలదీస్తారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు అయ్యేవరకు పోరాటం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.