కుర్చీని వదిలేదేలే..

. డిప్యుటేషన్ రద్దు చేసినా కదలని ఎంపీడీవో

 . ఆది నుంచి వివాదాస్పదమవుతున్న తీరు

. నాడు దస్తూరాబాద్ లో.. ఇప్పుడు మాక్లూర్ లో అవినీతి ఆరోపణలు

. షోకాజ్ నోటీసులకు స్పందించని అధికారిణి

బతుకమ్మ, నిజామాబాద్:  ప్రజలకు సౌకర్యాల కల్పన, అభివృద్ధికి వెచ్చించాల్సిన నిధులను పక్కదారి మళ్లించి జేబులో వేసుకోవడంలో ఆ ఎంపీడీవో సిద్ధహస్తులనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.  ఆ అధికారిణి పేరు చెబితేనే కార్యాలయ సిబ్బందితోపాటు మండల పరిధిలోని వారందరూ చీదరించుకునే పరిస్థితి ఉన్నా.. తాను ఉన్న స్థానం నుంచి కదలకుండా అక్రమార్జనకు పాల్పడుతున్నారు.  నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్ పల్లి మండలం నుంచి మాక్లూర్ మండల పరిషత్ కు డిప్యూటేషన్ పై  వచ్చిన ఎంపీడీవో వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

నిర్మల్ జిల్లాలో..

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ లో ఆ ఎంపీడీవో పని చేసినప్పుడు 2020 – 21, 2021 – 22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగమైనట్లు అక్కడి జిల్లా పరిషత్ సీఈవో తనిఖీల్లో గుర్తించారు. అంతకు ముందే ఉన్నతాధికారులు ఆమెను సరెండర్ చేశారు. నిధుల దుర్వినియోగంపై నిర్మల్ జెడ్పి సీఈవో సంబంధిత శాఖ రాష్ట్ర కమిషనర్ కు లేఖ రూపంలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

 

డిప్యూటేషన్ పై వచ్చి కదలకుండా

ఆ తరువాత తన పలుకుబడి, రాజకీయ ఒత్తిడితో వెంటనే జిల్లాలోని జక్రాన్ పల్లి మండలంలో పోస్టింగ్ తెచ్చుకున్నారు. మాక్లూర్ మండలం పై కన్నేసిన ఎంపిడిఓ అనుకున్నదే తడవుగా డిప్యుటేషన్ తెచ్చుకున్నారు. కార్యాలయ సిబ్బందిని తనకు అనుకూలంగా మార్చుకున్న ఆమె.. తన మాట వినని వారిని మానసికంగా వేధించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మరీ తన అజమాయిషీని కొనసాగించారు. ఫిర్యాదులు, ఆరోపణల నేపథ్యంలో డిప్యుటేషన్ ను రద్దు చేసినప్పటికీ ఆమె మాక్లూర్ లో కుర్చీ ఖాళీ చేయడం లేదు. సుమారు 20 రోజుల క్రితం బదిలీపై వచ్చిన ఎంపీడీవోకు ఆమె బాధ్యతలు అప్పగించకపోవడంతో వెనుదిరిగారు.

నిధుల దుర్వినియోగంపై…!

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ తో పోలిస్తే మాక్లూర్ మండలంలో ఆ ఎంపీడీవో ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. చిన్నాపూర్ గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన అర్బన్ పార్క్ పనుల్లో లక్షలాది రూపాయలు దుర్వినియోగమైనట్లు తెలిసింది. మండల కార్యాలయం నుంచి ఫర్నిచర్, కూలర్లు ఒకటేమిటి కళ్లకు ఏది కనిపిస్తే అది మాయం చేస్తున్నారని సిబ్బంది గుసగుసలాడుకుంటున్నారు. రెండో శనివారం, ఆదివారం రాగానే కార్యాలయం నుంచి ముఖ్యమైన సామగ్రిని తరలిస్తున్నా నోరుమెదపలేకపోతున్నామని సిబ్బంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యనే తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం కొన్ని నిధులను  పరిషత్ ఖాతా నుంచి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

సంజాయిషీ ఇచ్చేది లేదు..

దస్తురాబాద్ లో జరిగిన 15వ  ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం వ్యవహారంపై రాష్ట్ర కమిషనర్ నిజామాబాద్ సీఈవోను వివరణ కోరినట్లు సమాచారం.  ఈ నేపథ్యంలో సంజాయిషీ ఇవ్వాలని మాక్లూర్ ఎంపీడీవోను సీఈవో ఈనెల 16న ఆదేశించినట్లు తెలిసింది. ఇవన్నీ తనకు షరామామూలే అన్నట్లుగా భావించే ఎంపీడీవో ఇప్పటికీ సమాధానం ఇవ్వలేదని సమాచారం. డిప్యూటేషన్ రద్దు చేసుకుని వెళ్లాలని అధికారులు సూచించినా మాక్లూర్ ను అంటిపెట్టుకొని ఉండటంతో నిధుల దుర్వినియోగం చాలా జరుగుతుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

విధుల్లో ప్రైవేట్ డ్రైవర్ జోక్యం

ఎంపీడీవో  వాహనానికి డ్రైవర్ గా ఉన్న వ్యక్తి కార్యాలయ విధుల్లో జోక్యం చేసుకోవడమే కాకుండా చాంబర్లోనే కూర్చుంటున్నాడంటే ఎంతలా అవినీతి జరుగుతుందో ఊహించొచ్చు.  ప్రైవేటు వ్యక్తికి ఇచ్చిన విలువ ఎంపీడీవో తమకు ఇవ్వడం లేదని  కార్యాలయ సిబ్బంది మండిపడుతున్నారు. తన మాటకు ఎదురు చెబుతున్నారనే కారణంతో కార్యాలయ పర్యవేక్షకుడిని  సరెండర్ చేశారు. జిల్లా అధికారులు స్పందిస్తే ఎంపీడీవో చేస్తున్న నిధుల దుర్వినియోగంతో పాటు అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఉద్యోగులు కోరుతున్నారు.

Leave the chair..
Comments (0)
Add Comment