రేషన్ దందాలో సుల్తాన్ ల రాజ్యం

. పీడీఎస్ సిండికేట్ ను శాసిస్తున్న ‘చావల్ వాలే’ బ్రదర్స్

. జిల్లా కేంద్రంలో బహిరంగంగా గోదాంల నిర్వహణ

. నిత్యం సరిహద్దులు దాటుతున్నవంద టన్నుల రేషన్ బియ్యం

. పోలీసు స్టేషన్ ల వారీగా నెలవారీ మామూళ్లు?

నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా కేంద్రంలో రేషన్ బియ్యం సిండికేట్ ను ‘చావల్ వాలే భాయ్’(అన్నాదమ్ముళ్లు) శాసిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని  నటరాజ్ థియేటర్ సమీపంలో నలుగురైదుగురితో సిండికేట్ ను ఏర్పాటు చేసి రేషన్ మాఫియాను శాసిస్తున్నారు. రేషన్ దందాను సిండికేట్ గా నడుపుతున్నారంటే వారు ఏమైనా వైట్ కాలర్ దందా చేస్తున్నారా? అంటే అలాంటిదేమీ లేదు. వారు చేసేది అంతా దో నంబర్ దందానే. వారికి ప్రభుత్వం కేటాయించిన రేషన్ దుకాణం లేదు.. రైతులు అంతకన్నా కారు. కనీసం కిరాణ దుకాణమూ లేదు. కానీ ప్రతిరోజూ నిజామాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల నుంచి రేషన్ బియ్యం సేకరించడం, కొందరు రేషన్ దుకాణాదారులు ఇచ్చే టోకు రేషన్ బియ్యాన్ని పోగు చేసి ప్రతి నెలా 1 నుంచి 15వ తేదీ వరకు ( రేషన్ బియ్యం పంపిణీ జరిగిన రోజుల్లో) ప్రతిరోజూ 100 టన్నుల పీడిఎస్ బియ్యాన్ని సరిహద్ధులు దాటిస్తున్నారు.  నిత్యం వంద టన్నుల బియ్యం సేకరిస్తున్న  వారికి రైస్ మిల్లు ఉందనుకుంటే పొరపాటే. బోధన్ రోడ్డులోని అశోక్ నగర్ లోని శ్మశాన వాటిక పక్కన ఒక గోదాం, ఖిల్లారోడ్డులో ఓ పాత ఐస్ ఫ్యాక్టరీని గోదాంగా మార్చి నిత్యం సరుకు లోడింగ్, అన్ లోడింగ్ చేస్తున్నారు. ఇంత బహిరంగంగా గోదాములను నిర్వహిస్తూ ప్రతి రోజూ లారీలు, డీసీఎంల ద్వారా రేషన్ బియ్యాన్ని  రాష్ట్ర సరిహద్దులు దాటిస్తుంటే సివిల్ సప్లయీస్, పోలీస్, టాస్క్ ఫోర్స్ ఏం చేస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  ఇదిలా ఉండగా, ‘చావల్ వాలే భాయ్’ (అన్నాదమ్ముళ్లు) ప్రతి నెలా పోలీసు స్టేషన్ ల వారీగా ఠంచనుగా మామూళ్లు ఇవ్వడం చూసీచూడనట్లు ఉండిపోవడానికి కారణమనే ఆరోపణలున్నాయి. నెలనెలా వచ్చే జీతం కన్నా ముందే సివిల్ సప్లై, నిఘాశాఖలతోపాటు స్టేషన్ పోలీసులకు మామూళ్లు అందుతుండడంతో ఆ గోదాముల వైపు కన్నెత్తి చూడడం లేదని పలువురు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విధంగా మేనేజ్ చేస్తున్న పీడీఎస్ మాఫియా లారీలు, డీసీఎంలలో బియ్యాన్ని బోధన్ ప్రాంతానికి చెందిన ఆచన్ పల్లికి చెందిన ఫేమస్ రైస్ మిల్లర్ కు చేరవేస్తున్నారు. లేదా  సీఎం ఆర్ లోటు ఉన్న రైస్ మిల్లర్లకు కాదని మహారాష్ర్ట్రకు తరలించిన సొమ్ము చేసుకుంటున్నారు.  బియ్యం తరలించేందుకు వినియోగించే వాహనదాల నంబర్లను ముందుగానే పోలీసులకు అందించి వాటిని ఆపకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తమ దందా పోలీసు శాఖలోని కొన్ని విభాగాలతో పాటు పలువురు అధికారులకు తెలిసే జరుగుతుందని సిండికేట్ మాఫియా బహిరంగంగా చెబుతోంది. నిజామాబాద్ నగరంలోని కీలక పోలీస్ స్టేషన్ అధికారి సమన్వయంతోనే సిండికేట్ మాఫియా ఆగడాలు మితిమిరిపోతున్నాయి. బోధన్ రోడ్డు సరిహద్దున ఉన్న పోలీస్ స్టేషన్ లో చివరగా సీసీ కెమెరాలను దాటుకుని ప్రతి రోజూ రేషన్ మాఫియా లారీల్లో టన్నుల కొద్ది బియ్యాన్ని రవాణా చేస్తున్నా కేసులు లేకపోవడమే దీనికి నిదర్శనం.

పోలీసులతో చెట్టాపట్టాల్

పీడీఎస్ దందా చేస్తున్న వారికి నేర చరిత్ర ఉన్నా చర్యలు లేకపోవడానికి కారణంగా.. వారు పోలీసులతో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే. నిజామాబాద్ చావల్ వాలే బ్రదర్స్ కు అందులోని పార్టనర్ లకు పోలీసులతో దోస్తానా కుదరడానికి కారణంగా నేర చరిత్రే… 2022 డిసెంబర్ 31న నగరంలోని ఆరో టౌన్ పరిధిలో నెహ్రూనగర్ వద్ద జరిగిన రౌడిషీటర్ హత్య కేసులో ఇద్దరు చావల్ వాలే భాయ్ పాత్ర బహిర్గతమైంది. హతుడి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ లోమాత్రం వారి ప్రస్తావనే లేదు. దీనికి కారణంగా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారడమే దీనికి కారణమనే ఆరోపణలున్నాయి. 2023 జూన్ 1న ఎడపల్లిలో జరిగిన మరో రౌడీ షీటర్ హత్య కేసులో పీడీఎస్ మాఫియా ప్రమేయం అందరికీ తెలిసిందే. సిరికొండలో గతేడా హైదబాద్ కాలాపత్తర్ కు చెందిన రౌడీ షీటర్ అసద్ గ్యాంగ్ ఓ ఫంక్షన్ హాలులో సూపారీ ఇచ్చిన వ్యక్తులనే కత్తులతో పోడిచింది. కాలాపత్తర్ కు చెందిన రౌడీ షీటర్ ను సిరికొండకు సెటిల్మెంట్ కు రప్పించింది కుడా పీడిఎస్  దందా సూత్రధారే. నిజామాబాద్ రూరల్ మండలంలోని ఓ గ్రామ మాజీ ప్రజా ప్రతినిధి మట్కా తో పాటు పీడీఎస్ దందాలో ఆరితేరారు. ఖిల్లా రోడ్డులో ఓ పాత ఫ్యాక్టరీ గోదాం నిర్వాహకులపై కమ్యూనల్ షీట్ ఉంది. వారందరికీ పెద్ద ఎత్తున నేర చరిత్ర ఉండటంతో పోలీసులతో పీడీఎస్ మాఫియా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. అందుకే ప్రతి రోజూ టన్నుల కొద్ది రేషన్ బియ్యం పేదలకు అందకుండా నేరుగా రీ సైక్లింగ్ దందాకు తరలిపోతోంది.

Kingdom of Sultans in Ration Danda
Comments (0)
Add Comment