బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు వరద బాధితులకు తన వంతు సహాయంగా ఒక నెల జీతంను విరాళంగా ప్రకటించారు. ప్రకృతి విలయతాండవంతో అతలాకుతులమైన వరద బాధితులకు ఒక నెల జీతం విరాళం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు స్పష్ఠం చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వరదల వల్ల సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పరంగా సహాయక చర్యలు చేపట్టామన్నారు. అందుకు తోడుగా ఒక నెల జీతాన్ని వారికి అందించనున్నామన్నారు. ప్రజల కష్టాల్లో తోడుండే పార్టీ కాంగ్రెస్ అని, ఇప్పుడు కూడా విలయం సృష్టించిన విపత్తులో ప్రజల పక్షాన నిలబడిందని వెల్లడించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలంతా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.