బొందెం చెరువు వెంచర్ కథ కంచికేనా?

  • చెరువు శిఖం కబ్జా పేరిట అక్రమ నిర్మాణాల కూల్చివేత
  • పది మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు
  • ప్రధాన సూత్రదారిని తప్పించారా?
  • మిగిలిన అక్రమ కట్టడాల సంగతేమిటి
  • బొందం చెరువుకే హైడ్రా పరిమితమా

బతుకమ్మ, నిజామాబాద్ – నిజామాబాద్ నగరంలో ఈ నెల 17న పదవ డివిజన్ లోని బొందం చెరువు శిఖం భూమి కబ్జా వ్యవహరంలో జిల్లా అధికార యంత్రాంగం చేసిన హడావుడి ఒక్కరోజుకే పరిమి తమైంది. ప్రభుత్వం హైడ్రా పేరిట చెరువుల శిఖం భూములతో పాటు ప్రభుత్వ భూములను కాపాడేందుకు అక్రమ నిర్మాణాలు కూల్చేసే పనిని చేపట్టిన విషయం తెల్సిందే. నాగారాంలోని బొందెం చెరువు సర్వే నంబర్ 2099లో ఉన్న 23 ఎకరాల 3 గుంటల భూమి కబ్జాకు గురైందని గుర్తించిన విషయం తెల్సిందే. అక్కడ స్థానిక కార్పొరేటర్ భర్త, మరికొంత మంది బీఆర్ఎస్ నాయకులు, దళారులు కలిసి భారతిరాణి నగర్, దొడ్డుకొమురయ్య కాలనీ శివారు ప్రాంతం పేరిట పట్టాలు తయారు చేసి అమ్మిన విషయం వెలుగులోకి వచ్చింది. దాదాపు 65 అక్రమ నిర్మాణాలు, కబ్జాలను గుర్తించి 27 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. దానితో అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్ళను కట్టుకున్న బాధితులు ఈ విషయంలో తమను మోసం చేశారని స్థానిక పోలీస్ స్టేషన్ ఎదుట 18న ధర్నా నిర్వహించారు. తమకు పట్టాలు ఇచ్చి పైసలు తీసుకుని చెరువు శిఖం భూమిని అంటగట్టిన వారిపై ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఇళ్ళు కట్టుకున్న నూర్జహన్ బేగం, సానియా బేగం, ఆరీఫా బేగం, ఫరీదా బేగం అనే బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు 19న 5వ టౌన్ పోలస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నంబర్.166/2024లో ఆరు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందులో ఏ1గా కమల, ఏ2 మహ్మద్, మక్కల గోపాల్, 10వ డివిజన్ కార్పొరేటర్ కోమల్ భర్త నరేష్, మస్తాన్, జావిద్, అనురాధా, ఉబేర్, అంజద్, మంజులతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలోని ఒక మీ సేవా కేంద్రం నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి పట్టాలు, స్టాంపులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారు వివరాలను సేకరస్తున్నారు. నాగారంలో బొందెం చెరువు శిఖం భూమిలో 65 అక్రమ కబ్జాలను గుర్తించిన అధికార యంత్రాంగం కేవలం 27 మాత్రమే కూల్చి మిగిలిన వాటిని వదిలివేయడం ఏమిటని ప్రశ్న తలెత్తింది. 2016 వరకు రెవెన్యూ రికార్డుల్లో పహానీలు బొందెం చెరువు శిఖం భూమి 23 ఎకరాలుగా ఉండగా కేవలం సగం మాత్రమే తొలగించి మిగిలిన వాటిని వదిలివేయడం వెనుక రాజకీయ ఒత్తిడి పని చేసిందన్న విమర్శలు, ఆరోపణలు గుప్పుమన్నాయి. ప్రధానంగా పేదలు రూపాయి రూపాయి కూడబెట్టి కష్టపడ భూమిని కొనుగోలు చేస్తే అవి అక్రమ నిర్మాణాలను కొన్నింటిని కూల్చివేసి మరికొన్నింటిని వదిలివేయడం వెనుక పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అప్పటికే బాధితులు, మజ్లీస్ పార్టీ నాయకులు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పత్రికముఖంగా కబ్జాలకు పాల్పడిన బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరినా ద్వితీయ శ్రేణి నాయకులను, దళారులపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపణలున్నాయి.
నాగారాం బొందెం చెరువు అక్రమణల విషయంలో ప్రభుత్వ యంత్రాంగం సీరియస్ గా ఉండడంతో అక్కడ అక్రమాలపై తొలిసారి ప్రపంచానికి తెలిసింది. ఎందుకంటే 10,11,12, 13,14 డివిజన్ లలో మాత్రమే ప్రభుత్వ ఉంది. ఆయా డివిజన్ లలోనే వేల మందికి పేదలకు పట్టాలిచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలను చెరబట్టి ప్లాట్ల దందా జరుగుతుంది కూడా అక్కడే. అయితే నగరంలోని 9,10,11 డివిజన్ లలో బీఆర్ఎస్ తరపున ఉన్న లీడర్ ను సామంత రాజుగా చెబుతారు. అక్కడ ప్లాట్లు అమ్మాలన్నా, కొనాలన్నా, కబ్జా చేయాలన్న, చివరకు మొరం తరలించాలన్నా సంబంధిత లీడర్ కనుసన్నుల్లోనే జరుగుతుందని అందరికీ తెలిసిందే. వారి కనుసన్నుల్లోనే రెవెన్యూ, మున్సిపల్, ఎలక్ట్రిసిటి, రిజిస్ట్రేషన్ శాఖలు అక్రమాలకు వెన్నుదన్నుగా ఉన్నాయని చెప్పాలి. ఈ నెల 17న బొందెం చెరువులో అక్రమణలు కూల్చివేసినప్పుడు బాధితులు అక్రమార్కుల్లో ప్రధాన సూత్రదారుడి పేరును ప్రస్తావించిన ఎఫ్ఐఆర్ నమోదుకు మాత్రం తొలగించారనే వాదనలున్నాయి. ప్రధానంగా ఎంఐఎం నాయకులు, బాధితులు పోలీస్ కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేసినా సూత్రదారి పేరును తప్పించడం వెనుక మతలబు ఉందనే చర్చ జరుగుతుంది. ఏకంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతనే సూత్రదారిని తప్పించారనే వాదనలున్నాయి. అక్రమాలకు పాల్పడింది ఒకరు, నష్టపోయింది మాత్రం బాధితులు అన్న పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ భూములను అడ్డాగా చేసుకుని జరుగుతున్న ప్లాట్ల దందాలో బాధితులపై సీరియస్ గా ఉండాల్సిన తరుణంలో సూత్రదారిని తప్పించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

Is the story of the Bondem pond venture Kanchike?
Comments (0)
Add Comment