నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: కామారెడ్డిలో చెల్లని రూపాయి షబ్బీర్ అని, నేనేదో సాధిస్తానని గొప్పులు చెప్పుకుంటూ తిరగడం తప్ప ఆయన చేసేదేమీ లేదని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు విమర్శించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎంతో మంది క్రీడాకారుల కోసం స్టేడియం నిర్మించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సీఎం రేవంత్, ఇన్ చార్జి మంత్రి జూపల్లి, కలెక్టర్ కు వినతిపత్రాలను గతంలోనే అందజేశారన్నారు. ఎంతోమంది నిరుపేద యువకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ ల రుణాల కోసం ఎదురు చూస్తున్నారని, షబ్బీర్ అలీ ప్రభుత్వంతో మాట్లాడి యువతకు కార్పొరేషన్ లోన్లు ఇప్పించాలని హితవు పలికారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.