ఆరోపణల నేపథ్యంలో బల్దియాలో కంటితుడుపు చర్యలు

  •  ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకే మళ్ళీ ఎస్సైలుగా బాధ్యతలు
  •  రెగ్యులర్ ఉద్యోగులపై వారిదే పెత్తనం

బతుకమ్మ, నిజామాబాద్ : ఇటీవల కాలంలో మున్సిపల్ కార్యాలయంలో వివిధ విభాగాల అధికారుల విధుల మీద అనేక ఆరోపణలు వొస్తున్న నేపథ్యంలో బుధవారం పారిశుధ్య, ఆరోగ్య విభాగంలో పని చేయుచున్న శానిటరీ ఇన్స్పెక్టర్స్ సర్కిల్ సూపర్ వైజర్ ఆఫీసర్లను ప్రస్తుతం వారు పనిచేయుచున్న సర్కిల్ నుండి ఇతర సర్కిల్స్ కి బదిలీ చేస్తూ కమిషనర్ మంద మకరంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దశల వారీగా అన్ని విభాగాలలో ప్రక్షాళన చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అయితే మున్సిపల్ కార్పొరేషన్ లో ఐఏఎస్ కమిషనర్ అయినా ర్యాంకర్లు కమిషనర్లు అయినా పారిశుధ్ద్య విభాగం గాడిన పడే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే బల్ధియాలో అవినీతి, అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నా సంవత్సరాల తరబడి పని చేస్తున్న మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులదే పెత్తనం. 20 ఏళ్ళ పైచిలుకు సర్వీసు ఉన్న రెగ్యులర్ ఉద్యోగులపై పెత్తనాన్ని ఔట్ సోర్సింగ్, ఎన్ఎంఆర్, డిప్యూటేషన్స్ వారికే కట్టబెడుతూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయడాన్ని బల్ధియా ఉద్యోగులే తప్పుపడుతున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 5 సర్కిళ్లు ఉండగా 9 మంది అధికారులకు బాధ్యతలు అప్పజెబుతూ రెండు దశాబ్ధాల క్రితం ఉత్తర్వులుజారీ అయ్యాయి. అందులో ఇద్దరు మాత్రమే రెగ్యులర్ సానిటరి ఇన్స్ పెక్టర్లు ఉన్నారు. వారికి మాత్రమే బదిలీలు, సర్కిళ్ళు మార్పిడి జరుగుతుంది. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో రెండు దశాబ్ధాలుగా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు డిప్యూటేషన్ పై సానిటరి ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్నారు. ఒకరు ఎన్ఎంఆర్ గా ప్రస్థానం ప్రారంభించి కమిషనర్ సీసీగానూ పని చేశారు. మిగిలిన ఐదుగురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు. వారిపై వచ్చిన అవినీతి, అక్రమ ఆరోపణలు అన్నీఇన్నీ కావు. వారిని సంబంధితపారిశుద్ద్య సెక్షన్ నుంచి బదిలీ చేసే ధైర్యాన్ని ఎవరు చేయడం లేదు. కేవలం రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్న వారు ఆదిలాబాద్ కు చెందిన వారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా రెగ్యులర్ ఉద్యోగులపై పెత్తనం కొనసాగిస్తున్నారు. వారికే బుధవారం కమిషనర్ కేవలం సర్కిళ్ళను మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులపై పారిశుధ్ద్య సిబ్బంది, జవాన్లు మండిపడుతున్నారు. పారిశుద్ద్య కార్మికులు గైర్హాజర్ అయినా డబ్బులు వసూల్ చేసి అటెండెన్స్ వేస్తారని ప్రధాన ఆరోపణ. కారుణ్య నియామకాలకు, వాహనాల డిజిల్ లోనూ, చెత్త సేకరణకు సంబంధించి సంబంధిత వాణిజ్య సముదాయాల యజమాన్యాల వద్ద వసూళ్లు, ట్రేడ్ లైసెన్స్ లకు సంబంధించి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సానిటరి ఇన్స్ పెక్టర్ లపై ఉన్న ఆరోపణలు బల్ధియాలో మరెవ్వరిపై లేదు. అలాంటి వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకోకుండా కంటితుడుపు చర్యగా సర్కిళ్ళు మార్చారనే వాదనలున్నాయి. సానిటరి ఇన్స్ పెక్టర్ రెగ్యులర్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇళ్ళ వద్ద పని చేయించుకుంటున్నారనే ఆరోపణ కొనసాగుతుంది. కమిషనర్ బదిలీ చేసిన వారిలో వైద్య ఆరోగ్య శాఖ నుంచి డిప్యూటేషన్ లో సానిటరి ఇన్స్ పెక్టర్లుగా పని చేస్తున్న నటరాజ్ గౌడ్ నుంచి 2వ నంబర్ సర్కిల్ నుంచి ఏబీసీ సెంటర్, మినీ ట్యాంక్ బండ్, వైకుంఠ దామాలు, సీజనల్ వ్యాధుల విభాగానికి బదిలీ చేశారు. మరో వైద్య ఆరోగ్య శాఖాధికారి సాల్మాన్ రాజ్ ను డంపింగ్ యార్డు నుంచి వాహనాల విభాగానికి బదిలీ చేశారు. ఎన్ఎంఆర్ గా ఉన్నప్రభుదాస్ ను సర్కిల్ 1 నుంచి డంపింగ్ యార్డుకు బదిలీ చేశారు. రెగ్యులర్ సానిటరి ఇన్స్ పెక్టర్లు అయిన మహేష్ కుమార్ కు 4వ సర్కిల్ ఏ, సానిటేషన్ స్టోర్ కు బదిలీ చేయగా, షాదుల్లా హుస్సెన్ మినీ ట్యాంక్ బండ్ నుంచి సర్కిల్ 4 బి విభాగానికి బదిలీ చేశారు. ఔట్ సోర్సింగ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్.ప్రశాంత్ ను సర్కిల్ 4బి నుంచి సర్కిల్ 1కు , సునీల్ కుమార్ ను సర్కిల్ 4 ఏ నుంచి సర్కిల్ 2కు, సర్కిల్ 5లో ఉన్న ఎం.మహిపాల్ కు సర్కిల్ 3కు, సర్కిల్ 3లో ఉన్న శ్రీకాంత్ సర్కిల్ 5కు బదిలీ చేశారు.

eye-opening operations in BaldiaIn the wake of the allegations
Comments (0)
Add Comment