విస్తారంగా వానలు.. నిండిన చెరువులు, వాగులు..

– నిండుగా ప్రవహిస్తున్న గోదావరి
– రెండు పంటలకు డోకా లేనట్లే
– హర్షం వ్యక్తం చేస్తున్న కర్షకులు

బతుకమ్మ, నవీపేట్ : మూడు రోజులుగా విస్తారంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో మండలం లోని అన్ని గ్రామాల్లో చెరువులు, వాగులు నిండు కుండలా మారాయి. చెరువులకు అలుగులు పారుతున్నాయి. వాగులు, చెక్ డ్యామ్ లు జలాశయాలు మత్తడి దుంకుతున్నాయి. మండలం లోని జన్నేపల్లి వాగు, నాలేశ్వర్ వాగు నిండుగా ప్రవహిస్తున్నాయి. బాసర బ్రిడ్జి వద్ద గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు పరిసర ప్రాంత ప్రజలను, రైతులను అప్రమత్తం చేశారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు. పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.

నిండు కుండలా జలవనరులు..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో అన్ని గ్రామాల్లో చెరువులు, కుంటలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. నిన్నటి వరకు నిండని గోదావరి కి లక్ష క్యూసెక్కుల వరద నీరు రావడంతో ఖరీఫ్ తో పాటు రబీ పంటలకు సాగు నీటికి డోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గోదావరి నిండుగా వరద రావడంతో అలీసాగర్ లెఫ్ట్ ఇరిగేషన్ కింద సాగు చేస్తున్న రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీటికి తోడు భూగర్భ జలాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు సంవృద్దిగా కురవడంతో సాగు మరియు తాగునీటి కొరత ఉండదని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలకు కూలిన ఇల్లు..

కురుస్తున్న భారీ వర్షాలకు నవీపేట్ మండల కేంద్రంలో ఒక నివాస గృహం కూలిపోయింది. బుడ్డ నాగన్న కు చెందిన ఇల్లు వర్షాలకు తడిసి కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోయేసరికి ప్రాణాపాయం తప్పింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరారు.

Heavy rains.. full pondsstreams..
Comments (0)
Add Comment