- ఒకరి పేరుతో రెండు ఖాతాలు
- చనిపోయిన వారి పేర్లతో బీమా
- ఆందోళన వ్యక్తం చేస్తున్న బొప్పాపూర్ గ్రామ రైతులు
రుద్రూర్, బతుకమ్మ : వ్యవసాయ పనుల్లో రైతులకు సేవలందించాల్సిన హుమ్నాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో అంతా గోల్ మాల్ జరుగుతోందని బొప్పాపూర్ గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి చెందిన రుణమాఫీ కానీ రైతులు హుమ్నాపూర్ సొసైటీకి వెళ్లి పరిశీలించగా, నివ్వరపోయే నిజాలు వెలుగు చూశాయని రైతులు ఆందోళన వ్యక్తపరిచారు. ఒకరి పేరుతో రెండు ఖాతాలు, బోగస్ ఖాతాలు, చనిపోయిన వారి పేర్లతో బీమా కట్టించుకోవడం, నో డ్యూ సర్టిఫికెట్ జారీ చేసిన బాకీ చూపించడం, ప్రభుత్వానికి రైతుల అసలు బాకీ చూపించకుండా తక్కువ చేసి చూపించడంతో బోప్పపూర్ గ్రామానికి చెందిన సుమారు 50 మంది రైతులు రుణమాఫీ కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, పాలకవర్గ సభ్యులు వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బొప్పపూర్ రైతులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాపూజీ లింగం, సురేందర్, దావోజి గంగారం, పట్ల సంతోష్ తెలుగాడం దత్తు తదితరులు పాల్గొన్నారు.