బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి డైట్ టెండర్లపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గతనెల 11న ప్రారంభమైన టెండర్ల ప్రక్రియ అదే నెల 20న ముగియగా, 12 టెండర్లు దాఖలు చేశారు. టెండర్లను తెరవడం ఆలస్యం కాగా, ఎట్టకేలకు స్పందించిన ఉన్నతాధికారులు నేడు(శుక్రవారం) ఓపెన్ చేయాలని నిర్ణయించారు. 12 ఏళ్లుగా ఒకే వ్యక్తి కాంట్రాక్టు దక్కించుకుంటున్నారు. ఈసారి ఎన్నో ఆశలతో టెండర్లు దాఖలు చేసిన వారు తమకు దక్కుతుందో, లేదోననే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. టెండర్ ప్రక్రియను పక్కాగా చేపట్టాలని, తమకు అవకాశం వస్తే నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామంటున్నారు. ఈసారి కూడా టెండర్ దక్కించుకునేందుకు పాత వ్యక్తి ప్రయత్నాలు చేస్తున్నారు. టెండర్ల ప్రక్రియలో ఏవైనా అవకతవకలు జరిగితే ప్రశ్నించేందుకు ప్రజాసంఘాలు, స్వచ్ఛంద సంస్థలు సిద్ధమయ్యాయి.