- జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
బతుకమ్మ ,కామారెడ్డి : మట్టి గణపతిని పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా ప్రజలకు సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని వివిధ శాఖల అధికారులకు సిబ్బందికి పర్యావరణహితమైన మట్టి గణపతులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రులలో వినాయకుని ప్రతిమలను పూజించడం, అనంతరం నీటి వనరులలో నిమజ్జనం చేయడం మన సాంస్కృతిలో భాగమని అన్నారు. ఆనందంగా జరుపుకునే ఈ పండుగ వలన పర్యావరణానికి అపాయం కలుగకూడదని రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి వారి ద్వారా మట్టి వినాయకులను సిద్ధం చేసి ఉచితంగా ప్రజలకు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని అధికారులు సిబ్బందితో పాటు, మున్సిపాలిటీలు, మండల పరిషత్ కార్యాలయాల్లో కూడా మట్టి గణపతులను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేసేందుకు అందుబాటులో ఉంచడం జరుగుతుందని ప్రజలు మట్టి గణపతులను పూజించి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీనివాస్ రెడ్డి, సిపిఓ రాజారామ్, జెడ్పి సీఈఓ చందర్ నాయక్, డిపిఓ శ్రీనివాస్, డిడబ్ల్యుఓ బావయ్య వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.