నిజామాబాద్, బతుకమ్మ: జిల్లాకు చెందిన శాస్త్రవేత్త, తన ప్రయోగాలకు ప్రపంచస్థాయిలో పేటెంట్ పొందిన మండాజి నర్సింహచారి యూరో ఏషియన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. గతనెల 31న దేశ ఆర్థికరాజధాని ముంబైలో యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి చారిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రతినిధులు మాట్లాడుతూ.. ప్రపంచ పేటెంట్ ద్వారా చారి సాధించిన అద్భుతాన్ని ప్రపంచంలో ఎవరూ సాధించలేదని, దీని ముఖ్య ఉద్ధేశమే ఆయనకు గౌరవ డాక్టరేట్ అందజేయడమని పేర్కొన్నారు. చారి వరల్డ్ పేటెంట్ సాధించిన ప్రయోగం ప్రపంచస్థాయిలో చాలా మందిని వ్యాధుల నుంచి కాపాడుతోందన్నారు. ఈ రోజుల్లో గుండెపోటు ముప్పు ఉన్న వారి ప్రాణాలను చారి ప్రయోగం కాపాడుతోందని కొనియాడారు. అలాగే వ్యవసాయరంగంలో చారి చేసిన ప్రయోగాలు అద్భుతమని, ఆయన ప్రయోగాలు రైతలకు ప్రయోజనం చేకూర్చడంతోపాటు పంట దిగుబడులను పెంచుతున్నాయని అభినందాంచారు. ఐరోపా దేశంలో చారికి మంజూరైన పేటెంట్, డిస్కవరీ, టీ ఎల్ సీ, బీబీసీ టీవీల్లో చారి ఇంటర్వ్యూలను తాము గమనించామని యూరో ఏషియన్ యూనివర్సిటీ ప్రతినిధులు తెలిపారు.