నిజామాబాద్, బతుకమ్మ: జిల్లా పాలనా వ్యవహారాలకు కేంద్రమైన కలెక్టరేట్ లో ఓ అజ్ఞాతవాసి చక్రం తిప్పుతున్నాడు. అసలు ఏ శాఖ పరిధిలో తానున్నదీ సాక్షాత్తు కలెక్టరేట్ పాలనావిభాగానికి అంతుచిక్కకుండా వ్యవహరిస్తున్న ఆ అధికారి ‘అజ్ఞాతవాసి’గా చలామణి అవుతున్నాడు. మెప్మాలో ఏవోగా డిప్యూట్యేషన్ తెచ్చుకున్న ఆయన.. ఆ కాల పరిమితి పూర్తయిన తరువాత ఎక్కడ కొనసాగుతున్నాడో తెలియకుండా జాగ్రత్తపడుతున్న వైనంపై ‘బతుకమ్మ’ ఇటీవల ‘మెప్మా.. చెప్మా.. ఆ అధికారి ఎక్కడ?’ శీర్షికతో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. ఈ కథనం కలెక్టరేట్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అసలు ఆ అధికారి మెప్మాలో పని చేశాడా? అని అధికారులు, సిబ్బంది చర్చించుకుంటున్నారు. మెప్మాలో ఏవో పోస్టు ఉండడం, ఆ సీట్లో అజ్ఞాతవాసి కూర్చోవడం తామెన్నడూ చూడలేదని ఆ శాఖ వారే పేర్కొంటున్నారు.
మెప్మాలో ఉన్నట్టా? లేనట్టా?
మెప్మాలో ఏవోగా చేరిన వారు ఐదేళ్ల వరకు డిప్యూటేషన్ లో కొనసాగే అవకాశం ఉంటుంది. దీనికోసం ప్రతి ఏడాది తాము జాయినింగ్ ఇచ్చిన తేదీలోగా పొడిగింపు ఉత్తర్వులను తెచ్చుకోవాల్సి ఉంటుంది. రెవెన్యూ నుంచి వచ్చిన ఆ అధికారి డిప్యూటేషన్ గత నెల 21 నాటికి ముగిసినప్పటికీ, పొడిగింపు కావాలని రాష్ట్ర కార్యాలయం (సెర్ప్)లో అర్జీ పెట్టుకున్న దాఖలాలు లేవని తెలిసింది. ఈ క్రమంలో ఉన్నతాధికారులు మరొకరికి ఏవోగా పోస్టింగ్ ఇచ్చారు. మరి ఆ అధికారిని సొంత శాఖకు పంపించారా? లేకపోతే సెర్ప్ ఆధీనంలోనే ఉన్నారా? అనే దానిపై రెవెన్యూ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.
ఆ కుర్చీ కోసం వెయిటింగ్
అటు మెప్మాలో డిప్యూటేషన్ పొడిగింపు తీసుకురాకుండా, ఇటు సొంత శాఖ పరిధిలోకి వెళ్లకుండా ఉన్న ఆ అధికారి కలెక్టరేట్ పరిధిలోని ఓ విభాగంలో కుర్చీ ఖాళీ అవుతుందని వేచి చూస్తున్నట్లు సమాచారం. అప్పటి వరకు అజ్ఞాతంలో ఉంటే తాను వెయిట్ చేస్తున్న కుర్చీలో కొనసాగుతున్న అధికారి పదవీ విరమణ చేస్తారని, అప్పుడు తనకు లైన్ క్లియర్ అవుతుందని కాచుకు కూర్చున్నట్లు తెలిసింది. ఏ శాఖలో కొనసాగకుండా సదరు అధికారి ఎలా కొనసాగుతున్నారనేది అంతుచిక్కని ప్రశ్న.
పాలనాధికారి చెంతకు ఫైల్
కలెక్టరేట్ లోని ఓ కీలక అధికారి సతీమణికి తహసీల్దార్ గా పదోన్నతి రావడంతో వేరే జిల్లాకు పంపడం ఇష్టం లేక మెప్మాలో ఏవోగా పోస్టింగ్ తెచ్చుకున్నారు. ఈ నెల 5న ఆమె విధుల్లో చేరడంతో ఒకే పోస్టులో మాజీ, తాజా అధికారులు ఉన్న వైనానికి సంబంధించిన ఫైల్ ను పాలనాధికారి చెంతకు పంపినట్లు తెలిసింది. ఆ అధికారి నిర్ణయం మేరకు జీతభత్యాలు మొదలుకానున్నాయనే అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
తిట్ల దండకం
తనను అకారణంగా కామారెడ్డి జిల్లాకు బదిలీ చేయించి మీరు మాత్రం జిల్లా కేంద్రాన్ని విడిచిపెట్టకుండా ఉండండి అంటూ యూనియన్ నాయకులపై ఓ మహిళా అధికారిణి తిట్లదండకం అందుకున్నట్లు రెవెన్యూ విభాగంలో ప్రచారం జరుగుతోంది. కీలక స్థానంలో కొనసాగుతున్న అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, తమ వారికి తమకు అనుకూలమైన చోట్ల పోస్టింగ్ లు ఇప్పించుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక యూనియన్ నాయకులు నోళ్లు మూసుకున్నట్లు సమాచారం. యూనియన్ ను అడ్డుపెట్టుకొని మీ బంధువులను, కుటుంబ సభ్యులను తీసుకువస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్లు అధికారులు, ఉద్యోగులు పేర్కొంటున్నారు.