గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయిన యువకుడు

  • ఇండియన్ ఎంబసీ ద్వారా స్వదేశానికి
  • ఏజెంట్ల పై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు

బతుకమ్మ, మాచారెడ్డి: బ్రతుకుదెరువు కోసం గల్ఫ్ వెళ్దామని ఏజెంట్ ఆశ్రయించిన యువకుడికి కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ విజిట్ వీసా ఇచ్చి మోసం చేసిన ఏజెంట్ల పై బాధితుడి ఫిర్యాదు మేరకు కామారెడ్డి జిల్లా మాచారెడ్డి పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే అక్కాపూర్ గ్రామానికి చెందిన గడ్డం మహేష్ జనవరి 2022 సంవత్సరంలో బ్రతుకుతెరువు కొరకు విదేశాలకు వెళదామని తెలిసిన వ్యక్తుల ద్వారా ఏజెంట్ లక్ష్మణ్, దుర్గాప్రసాద్ లను సంప్రదించాడు. మలేషియా కి వీసా ఇస్తామని, అక్కడ రోజుకు 10 గంటల డ్యూటీ, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ కంపెనీ లో డ్యూటీ ఇప్పిస్తామని మహేష్ దగ్గర 1,20,000/- తీసుకున్నారు. భవిష్యత్తు పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మహేష్ కి టూరిస్ట్ వీసా ఇచ్చి మలేషియాకి పంపించారు. మలేషియాలో ఫ్లైట్ దిగినంక మహేష్ ని లక్ష్మణ్, అమన్ అనే వ్యక్తులు రిసీవ్ చేసుకుని అక్కడ ఒక కంపెనీలో పనికి పెట్టించారు. రెండు నెలల 15 రోజులు పని చేసిన తర్వాత కూడా జీతం డబ్బులు ఇవ్వకుండా వేధించారు . మహేష్ మలేషియాలోని హై కమిషన్ ఆఫ్ ఇండియా ను ఆశ్రయించగా వారు మలేషియా నుండి ఇండియాకి తిరిగి పంపించారు. తనను మోసం చేసిన ఏజెంట్ లక్ష్మణ్, రాఘవపురం దుర్గాప్రసాద్, అమీన్ లపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని మాచారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి జరుపుతున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు.

A young man cheated by Gulf agents
Comments (0)
Add Comment