- ఎగువ మానేరు లచ్చ పేట శివారులో ఘటన
- పరిస్థితిని సమీక్షించిన మాచారెడ్డి ఎస్ఐ
బతుకమ్మ, మాచారెడ్డి: రాజన్న సిరిసిల్ల జిల్లా లోని జగ్వామనేరు లో మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామ శివారు వాగులో చేపల వేటకు వెళ్లిన మత్స్య కార్మికుడు గల్లంతయ్యాడు. లచ్చ పేట గ్రామానికి చెందిన కైరం కొండ శివ రాములు (56) అనే మత్స్య కార్మికుడు గల్లంతయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని ఆచూకీ కోసం వెదుకుతున్నారు. విషయం తెలుసుకున్న మాచారెడ్డి ఎస్ఐ అనిల్ ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో చేపల వేటకు వెళ్లిన శివరాములు ఇంటికి వెళ్లే సమయం అయినప్పటికీ ఇంకా రావడం లేదని వాగు పరిసరాలకు వెళ్ళగా, అతడు చేపల వేటకు ఉపయోగించిన తెప్ప, వల ఒడ్డుకు చేరింది. మోపెడు కూడా ఉంది. వర్షం ధాటికి, వేస్తున్న చలిగాలులకు తట్టుకోలేక తెప్ప నుండి జారి ప్రవాహంలో పడిపోయినట్లుగా అనుమానిస్తున్నారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు శివరాములు ఆచూకీ కోసం ఆందోళన కు గురై వెతికినా ప్రయోజనం లేకపోవడంతో అధికారులకు సమాచారం అందించారు. వాగు ప్రవాహం ఉదృతంగా ఉన్నందున అధికారులు అంచనా వేయలేకపోతున్నారు.